TelanganaTelugu News
తెలంగాణ టెన్త్ ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్
‣ విద్యాసంస్థల పునఃప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
‣ సిలబస్ తగ్గింపుపై త్వరలో నిర్ణయంతీసుకో బోతున్న ప్రభుత్వం
తెలంగాణలోని పాఠశాలలు మరియు కళాశాలల విద్య సంవత్సరం త్వరలోనే ప్రారంభించబోతున్నామని సబితా ఇంద్రరెడ్డిగారు తెలియజేశారు.వివిధ తరగతుల్లో సిలబస్ తగ్గింపుపై త్వరలోనే సమాచారాన్ని అందజేస్తారని తెలిపారు.తరగతులు ప్రారంభించేందుకు అన్ని విద్యా సంస్థలు సిద్ధం కావాలని..దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని మంత్రి కోరారు.ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి కాబట్టి రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ మరియు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో మంత్రి సమావేశమై పలు సూచనలు చేశారు.
పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతినిధులతో మంత్రి చర్చించారు. చర్చలో భాగంగా 14 డిమాండ్లను పరిష్కరించాలని పాఠశాల యొక్క ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంచెలంచెలుగా అన్ని తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు ఏడాదిగా ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు మంత్రికి తెలిపారు.జూన్ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని.. కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేయాలి. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చించాం. కొవిడ్పై అవగాహన కల్పిస్తూనే విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతినిధులను కోరాం. వారంతా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. పాఠశాలలకు సంబంధించి పలు సమస్యలను ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వం తరఫున సాధ్యమైనంతవరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లని విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించాం’’ అని మంత్రి తెలిపారు.