News
చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్
సిద్దిపేట : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న సీెం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్ దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు.
కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు.. సీఎం దంపతులకు వేదాశ్వీరచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత హోమ నిర్వాహకులు సీఎం కేసీఆర్కు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
ఉదయం 10 గంటల సమయంలో మర్కూర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు, చినజీయర్ స్వామీ పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు మర్కూక్ పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు.