Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ 28/01/2020
స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సదస్సు ముగింపు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సదస్సు విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది.
‘ప్రజల కోసం.. నగరాల నిర్మాణం’ అనే థీమ్తో సాగిన ఈ సదస్సు జనవరి 25న ముగిసింది. ఈ సదస్సుకు 100 నగరాల నుంచి 25 మంది ప్రముఖులు, 192 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టుల స్థితిగతులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ తదితర అంశాలపై సదస్సులో చర్చించారు.
విశాఖకు ఇన్నోవేషన్ ఐడియా అవార్డు
స్మార్ట్ సిటీస్ మూడో శిఖరాగ్ర సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ విభాగాల్లో ముందుకు దూసుకుపోతున్న స్మార్ట్ నగరాలకు పలు అవార్డులు ప్రకటించింది. 4 విభాగాల్లో 18 అవార్డులకు నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్కు 3 అవార్డులు లభించగా.. ఇందులో 2 అవార్డులను విశాఖపట్నం, ఒక అవార్డును అమరావతి సొంతం చేసుకున్నాయి. ఇన్నోవేషన్ ఐడియా అవార్డుతో పాటు పెర్ఫార్మెన్స్ రికగ్నైజేషన్ విభాగంలో టైర్-1 సిటీస్లో విశాఖపట్నం అవార్డు సొంతం చేసుకోగా, టైర్-3 విభాగంలో అమరావతి అవార్డు దక్కించుకుంది. గవర్నెన్స్ థీమ్లో వడోదర, బిల్ట్ ఎన్విరాన్మెంట్ థీమ్లో ఇండోర్ నగరాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి.
భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ఘనంగా జరిగాయి. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో నిర్వహించిన పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ముఖ్యఅతిథిగా బోల్సనోరా..
భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
యుద్ధస్మారక వద్ద ప్రధాని నివాళులు
వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. గతేడాది వరకు ఈ కార్యక్రమాన్ని ఇండియా గేట్ వద్ద ఉన్న ‘అమర్ జవాన్ జ్యోతి’ వద్ద నిర్వహించారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019, ఏడాది ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ ప్రారంభించారు.
22 శకటాల ప్రదర్శన
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన జరిగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్ ప్రదేశ్ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. ఆంధ్రప్రదేశ్ తిరుమల బ్రహ్మోత్సవ శకటం, తెలంగాణ బతుకమ్మ శకటం ఆహూతులను ఆకట్టుకున్నాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది.
తొలి ఘటనలు
- రాజ్పథ్లో జరిగిన పెరేడ్ని మహిళా కమాండర్ కెప్టెన్ తాన్యా షెర్గిల్ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి.
- సీఆర్పీఎఫ్కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్స్పెక్టర్ సీమ నాగ్ నేతృత్వంలో డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శన సాగింది.
- డీఆర్డీఒ 2019 ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్)ని ఈ సారి పెరేడ్లో తొలిసారిగా ప్రదర్శించారు.
- ధనుష్ శతఘు్నలను తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించారు.
- కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్లో ప్రదర్శించాయి.
గూగుల్ స్పెషల్ డూడుల్
భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్తో గూగుల్ శుభాకాంక్షలు తెలిపింది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ డూడుల్ను సింగపూర్కు చెందిన మెరో సేథ్ అనే కళాకారుడు రూపొందించారు. ఇందులో దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాలు, తాజ్మహల్, ఇండియా గేట్, వంటివి ఉన్నాయి. అలాగే భారత శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి, దేశంలోని వస్త్ర పరిశ్రమనూ చిత్రంలో చేర్చారు.
భారత్, పాక్ మధ్యవర్తిగా ఉంటాం : నేపాల్
భారత్, పాకిస్తాన్ల మధ్య విభేదాల పరిష్కారంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు నేపాల్ ముందుకువచ్చింది.
రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా సార్క్(దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య)ను పునరుత్తేజం చేస్తామని తెలిపింది. శాంతియుత చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని సార్క్ చైర్మన్గా ఉన్న నేపాల్ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, పాకిస్తాన్ల మధ్యవర్తిగా ఉంటాం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : నేపాల్
ఎందుకు : భారత్, పాకిస్తాన్ల మధ్య విభేదాల పరిష్కారానికి