Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 26/12/2019
జీఎన్ఎస్ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన
గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) పథకంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ఎత్తిపోతల పథకం అనుసంధానానికి వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు.
రూ.1,272 కోట్లతో చేపట్టిన ఈ అనుసంధాన పథకం ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
మరోవైపు చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల ప్రాజెక్టు, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి రాయచోటిలో శంకుస్థాపన చేశారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- రూ.60 వేల కోట్లతో రాయలసీమకు గోదావరి వరద జలాలను తరలిస్తాం.
- పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం.
- తెలుగుగంగ సామర్థ్యం 11,500 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులకు పెంచుతాం.
- కేసీ కెనాల్, నిప్పులవాగు కెపాసిటీని 12,500 క్యూసెక్కుల నుంచి 35,000 క్యూసెక్కులకు పెంచుతాం.
- గండికోటకు దిగువన మరో 20 టీఎంసీలతో రిజర్వాయర్కు ప్రతిపాదనల తయారీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎన్ఎస్ఎస్ – హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఎక్కడ : రాయచోటి, వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్కు 12వ స్థానం
బ్లూమ్బర్గ్ సంస్థ డిసెంబర్ 24న విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితా-2019(బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిలిచారు.
ఈ జాబితా ప్రకారం 2019 ఏడాదిలో ముకేశ్ సంపద విలువ 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగి… 60.8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు)కు చేరింది.
అగ్రస్థానంలో బిల్ గేట్స్..
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నిలిచాడు. బిల్ గేట్స్ సంపద 2019 ఏడాదిలో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన 19వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2019లో 12వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ
ఎక్కడ : ప్రపంచంలో
షూటింగ్లో మను భాకర్, అనీశ్లకు స్వర్ణాలు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతున్న జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో యువ షూటర్ మను భాకర్ నాలుగు స్వర్ణాలు గెలుచుకుంది.
హరియాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఏళ్ల మను సీనియర్ టీమ్ విభాగం, జూనియర్ కేటగిరి వ్యక్తిగత విభాగం, జూనియర్ టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సొంతం చేసుకుంది. డిసెంబర్ 24న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సీనియర్ ఈవెంట్ ఫైనల్లో మను 243 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దివ్యాంశి ధామా (237.8), యశస్విని సింగ్ (217.7) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో హరియాణాకే చెందిన అనీశ్ భన్వాలా స్వర్ణం గెలుచుకున్నాడు. అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేయగా… భవేశ్ షెఖావత్ (26), విజయవీర్ సిద్ధూ (22) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో నాలుగు స్వర్ణాలు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : మను భాకర్
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్