Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 20/12/2019
టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మిస్త్రీ
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది.
మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డెరైక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) డిసెంబర్ 17న ఆదేశించింది. టాటా సన్స్ చైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని పేర్కొంది. వీటికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. 2016, అక్టోబర్ 24న టాటా సన్స్ చైర్మన్గా మిస్త్రీని తొలగించారు. రతన్ టాటాను తాత్కళిక చైర్మన్గా నియమించారు.
పీఎంజీఎస్వై మూడో దశ ప్రారంభం
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై)మూడో దశ ప్రారంభమైంది.
న్యూఢిల్లీలో డిసెంబర్ 18న కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ఆవాసప్రాంతాల నుంచి వ్యవసాయ మార్కెట్యార్డులు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులను కలుపుతూ 1.25 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం మొత్తం రూ.80,250 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రప్రభుత్వం రూ.53,800 కోట్లు సమకూర్చుతుంది. మిగిలింది రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్గా సమకూర్చాల్సి ఉంటుంది. పథకం కాలపరిమితి 2019-20 నుంచి 2024-25 వరకు ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎంజీఎస్వై మూడో దశ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్యకలాపాలపై డిసెంబర్ 18న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు కావాలని సీఎం సూచించారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలు
రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ.. అవసరమైతే ఇంకోటి ఏర్పాటు చేసి, వాటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటన్నింటిపై ఏర్పాటయ్యే యూనివర్సిటీ వీటిని గైడ్ చేస్తుందన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారిలో మరింతగా నైపుణ్యం పెంపొందించేందుకే వీటిని తీసుకు వస్తున్నామని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ పని తీరు ఇలా..
- స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలకు చుక్కానిలా ఉంటుంది.
- ఎప్పటికప్పుడు వాటికి దిశ, నిర్దేశం చేస్తుంది.
- ఎప్పుడు ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలో సూచిస్తుంది.
- అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ
హైఎండ్ స్కిల్ వర్సిటీ పని తీరు ఇలా..
- నైపుణ్యవంతులను మరింతగా తీర్చిదిద్దడం
- రోబోటిక్స్లో ప్రపంచంతో పోటీ పడేలా శిక్షణ
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించేలా కసరత్తు
- విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చేలా అదనపు నైపుణ్యాలు సమకూర్చడం
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్