Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 18/12/2019
ఆఫ్రికా తీరంలో 20 మంది భారతీయుల కిడ్నాప్
ఆఫ్రికా పశ్చిమ తీరంలో 20 మంది భారతీయులను సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ వ్యవహారాన్ని భారత అధికారులు నైజీరియా అధికారులకు చేరవేశారు. హాంకాంగ్ జెండాతో ఉన్న పడవలో వీరు ప్రయాణిస్తుండగా కిడ్నాప్ అయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 10 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై నైజీరియా అధికారులతో మాట్లాడామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. నైజీరియా తీరం వెంట ఇలా జరగడం ఈ ఏడాది ఇది మూడోది.
కడప యురేనియం పరిశ్రమకు జాతీయ అవార్డు
ప్రమాదరహితంగా యురేనియం తవ్వకాలు చేపట్టినందుకు కడప జిల్లా ఎం.తుమ్మలపల్లె వద్ద ఉన్న యురేనియం పరిశ్రమకు నేషనల్ సేఫ్టీ అవార్డు-2015 లభించింది.
కేంద్ర కార్మికశాఖ న్యూఢిల్లీలో డిసెంబర్ 16న నేషనల్ సేఫ్టీ అవార్డ్స్-2015, 2016 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా కడప యూరేనియం పరిశ్రమ మైనింగ్ మేనేజర్ కమలాకర్రావ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కడప యురేనియం పరిశ్రమకు నేషనల్ సేఫ్టీ అవార్డు-2015
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎందుకు : ప్రమాదరహితంగా యురేనియం తవ్వకాలు చేపట్టినందుకు
లోక్సభ సీట్లను వెయ్యికి పెంచాలి : ప్రణబ్ ముఖర్జీ
భారత్లోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.
లోక్సభ సీట్లకు ప్రస్తుతమున్న 543 నుంచి 1000కి, అదే శాతంలో రాజ్యసభ సీట్లను పెంచాలని సూచించారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ‘భారత్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతమైందా? ముందున్న సవాళ్లేంటి’ అనే అంశంపై డిసెంబర్ 16న అటల్ బిహారీ వాజ్పేయి సంస్మరణ ప్రసంగాన్ని ప్రణబ్ వెలువరించారు.
ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ… ‘1971 జనాభా లెక్కల ఆధారంగా చివరగా 1977లో లోక్సభ సభ్యుల సంఖ్యను సవరించాం. అప్పటి జనాభా 55 కోట్లు. ప్రస్తుత జనాభా అందుకు రెండింతలు. అందువల్ల లోక్సభ సభ్యుల సంఖ్యను కూడా కనీసం 1000 చేయాలి’ అన్నారు. ఓటరు ఇచ్చే తీర్పును పార్టీలు సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు.