Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 13/12/2019
టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గ్రెటా థన్బర్గ్
ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది.
మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ డిసెంబర్11న తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది.
స్పెయిన్ వేదికగా డిసెంబర్ 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా గ్రెటా(స్వీడన్) ప్రసంగించారు. వాతావరణ కాలుష్యంపై పాలకులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మణిపూర్కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ కూడా సీఓపీ25 వాతావరణ సదస్సులో ప్రసంగించింది. వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను లిసిప్రియా కోరుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : గ్రెటా థన్బర్గ్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణకై కృషి చేస్తున్నందుకు
ఏపీ దిశ యాక్ట్-2019 బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ డిసెంబర్ 11న ఆమోదం తెలిపింది.
మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఏపీ దిశ చట్టంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఇండియన్ పీనల్ కోడ్లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్) సెక్షన్లను చేర్చే ముసాయిదా బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
- కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్శిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15.28 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయింపునకు మంత్రివర్గం అనుమతి.
- ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్ట్లో సవరణలకు కేబినెట్ పచ్చజెండా. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన నియమించిన వ్యక్తి అన్ని యూనివర్శిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు.
- కడప జిల్లాలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స ఏర్పాటు. రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు.
- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్మన్గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్ ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్స, ట్రేడ్స, కాలింగ్స అండ్ ఎంప్లాయిమెంట్ సవరణ ముసాయిదా బిల్లు-2019 కు ఆమోదం
- వీఓఏ/సంఘమిత్ర/యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం. జీతాలు రూ.10వేలకు పెంచుతూ ఇటీవలే నిర్ణయం.
- ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21-ఎ (1) (ఇ) సవరణకు కేబినెట్ ఆమోదం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ దిశ యాక్ట్-2019 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా
సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ
గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు కొత్త శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి డిసెంబర్ 11న అంగీకారం తెలిపింది.
గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం. లక్ష్యాల సాధనకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేలా కార్యాచరణ ఉంటుంది. ఉద్యోగులను సమర్ధంగా వినియోగించుకోవడంతోపాటు లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, మెరుగైన భాగస్వామ్యంతో మంచి ఫలితాలు రాబడతారు.
కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
- ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం కోసం పబ్లిక్ ట్రాన్సపోర్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకరించింది.
- అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిచేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
- ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. రూ.101 కోట్ల షేర్ క్యాపిటల్తో ఏర్పాటు.
- ఆంధ్రప్రదేశ్ మిల్లెట్ బోర్డు చట్టం-2019 ముసాయిదాకు బిల్లుకు గ్రీన్సిగ్నల్. కరవు, వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు ముసాయిదా బిల్లు.
- ఆంధ్రప్రదేశ్ పప్పుధాన్యాల బోర్డు చట్టం – 2019 బిల్లుకు ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లు పెంచేందుకు కేబినెట్ అంగీకారం. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.22 వేల కోట్లు.
- ఆంధ్రప్రదేశ్ గూడ్స అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి పచ్చజెండా
క్విక్ రివ్యూ :
ఏమిటి : సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు