Current Affairs
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ 05/02/2020
చైనా ప్రయాణికులకు భారత్ ఇ-వీసా రద్దు
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ-వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది.
ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని(కరోనా వైరస్ వ్యాప్తి) దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్లో భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 2న ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.
చైనాలో బర్డ్ ఫ్లూ భయం
కరోనా వైరస్తోనే నానాయాతన పడుతున్న చైనాలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాధి బయల్పడింది. హుబాయ్ ప్రావిన్స్ కు దక్షిణ సరిహద్దుల్లో హువాన్ ప్రావిన్స్ లో ఈ వ్యాధి బయటకి వచ్చింది. షోయాంగ్ నగరంలోని పౌల్ట్రీలో ఈ వైరస్ బయటపడినట్టు చైనా వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్కడ 7,850 కోళ్లు ఉంటే, 4,500 కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మరో 17,828 కోళ్లను వ్యవసాయాధికారులే చంపేశారు. ఇప్పటికింకా మనుషులకు ఈ వ్యాధి సోకలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా ప్రయాణికులకు ఇ-వీసా రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : భారత్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక ‘నాలుగో తరం’ రోబోను ప్రవేశపెట్టింది. హైదరాబాద్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 1న తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, సన్షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : సన్షైన్ ఆస్పత్రి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కీళ్లమార్పిడి శస్త్రచికిత్సకు
ఏపీలో గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పలికింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమం 13 జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80 శాతం పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్