General Knowledge
Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 04/12/2019
అయోధ్య భూవివాదంపై రివ్యూ పిటిషన్
అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది.
తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ డిసెంబర్ 2న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది’ అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు.
2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
కేంద్రం, రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది.
లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు డిసెంబర్ 2న నోటీసులు జారీ చేసింది. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)
ఎందుకు : మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంతో
భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే : క్రిసిల్
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స ఏజెన్సీ క్రిసిల్ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు డిసెంబర్ 2న ప్రకటించింది.
దేశంలో ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్-మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్బీ
అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ- డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ (డీఅండ్బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్ను దెబ్బతీసిందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : రేటింగ్స ఏజెన్సీ క్రిసిల్
ఎందుకు : దేశంలో మందగమన తీవ్రత ఎక్కువగా ఉన్నందున