NewsTelanganaTelugu News
అతి త్వరలో కేటీఆర్కు సీఎం పదవి..స్పష్టత ఇచ్చిన డిప్యూటీ స్పీకర్
- కేటీఆర్కు సీఎం పదవి బాధ్యతలు అప్పగించబోతున్నామన్నట్టు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
- ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలో కేటీఆర్ బాధ్యతలు ఇవ్వబోతున్నారన్నట్టు రాష్ట్రంలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని గట్టిగ కోరారు. ఆ వ్యాఖ్యలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ కూడా అంగీకరించారు. కేటీర్ తన బాధ్యతలను బాగా చేస్తున్నారని, ముఖ్యమంత్రి పదవి నిర్వహించగల సమర్థుడని దానికి అనుమానం అక్కర్లేదని తలసాని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన కచ్చితంగా సీఎం పదవి చేపడతారని చెప్పారు.
అయితే ఇంత జరుగుతున్నా, చాలా మందికి నమ్మకం కుదరలేదు. కేటీఆర్కు ఇప్పట్లో సీఎం పదవి అప్పగిస్తారా అని ఎక్కడో అనుమానం ఉంది . ఆ అనుమానాలను పటాపంచలు చేసే వాక్యాలు చెప్పిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ‘కాబోయే సీఎం కేటీఆర్కు శుభాకాంక్షలు..’ అంటూ కుండబద్దలు కొట్టేలా వాక్యాలు చేసారు. గురువారం (జనవరి 21) దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలి. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నా..’ అని పద్మారావు అన్నారు.
పద్మారావు ఈ వ్యాఖ్యలు చేస్తుండగా వేదికపైనే ఉన్న కేటీఆర్ మౌనంగా అలాగే ఉండిపోయారు. నవ్వడమో, సైగలతో వారించడమో లాంటి చర్యలు కూడా చేయలేదు. అంతేకాదు, ఆ మాటలు నిజమే అనే తరహాలో కేటీఆర్ గారి చర్యలు ఉన్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపడతారనే ఊహాగానాలకు ఈ ఘట్టం మరింత బలం చేకూర్చుతోంది.