Telugu News
ఇవన్నీ రద్దు అయితే ఎలా..? | వేచి చూస్తున్న క్రికెట్ అభిమానులు
క్రికెట్ అభిమానులు గతంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కొని ఉండరు. మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారితేనే ఎంతో బాధ పడేవారు.. ఇప్పుడు కనీసం ఒక్క మ్యాచ్ను కూడా చూడలేకపోతున్నారు. కరోనా వైరస్ ధాటికి క్రీడా ప్రపంచమంతా చాల విలవిలలాడుతోంది. గతంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొట్ట మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్ మత్తులో మునిగితేలాలనుకున్న భారత క్రికెట్ అభిమానుల ఆశలను కరోనా వైరస్ చిదిమేస్తోంది. అయితే ఈ మహమ్మారి విజృంభణ చూస్తుంటే మరో కొన్ని నెలల వరకు కూడా స్టేడియాలు తెరుచుకుంటాయో లేదోననే అనుమానాలు మాత్రం తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం ఎన్ని మ్యాచ్లు ఉన్నాయో ఓ లుక్ వేద్దాం..
Table of Contents
ఐపీఎల్
షెడ్యూల్ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. అప్పటి వరకు పరిస్థితులు సద్ధుమణిగితేనే ఐపీఎల్ను అభిమానుల మధ్య నిర్వహిస్తారు. తీవ్రత మాత్రం తగ్గకపోతే ఐపీఎల్ను రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు.
ఉమెన్స్ టీ20 ఛాలెంజ్
మహిళల ఐపీఎల్ తరహాలోనే నాలుగు జట్లతో మన దేశంలో ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. కానీ, ఈ కరోనా వైరస్ ధాటికి ఈ టోర్నీ నిర్వహణపై కూడా ఎన్నో సందేహాలు మొదలయ్యాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి నెలలో శ్రీలంక×ఇంగ్లాండ్ రెండు టెస్టులు; జూన్లో ఇంగ్లాండ్×వెస్టిండీస్ మూడు టెస్టులు; జులై-ఆగస్టులో ఇంగ్లాండ్×పాకిస్థాన్ మూడు టెస్టులు; జులైలో వెస్టిండీస్×దక్షిణాఫ్రికా రెండు టెస్టులు; అదే విధంగా అదే నెలలో బంగ్లాదేశ్×శ్రీలంక మూడు టెస్టులు; ఆగస్టులో బంగ్లాదేశ్×న్యూజిలాండ్ రెండు టెస్టులు; నవంబర్-డిసెంబర్లో న్యూజిలాండ్×వెస్టిండీస్ మొత్తం మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే శ్రీలంక×ఇంగ్లాండ్ టెస్టులు వాయిదా పడ్డాయి. మిగిలిన వాటిపై కూడా కరోనా ప్రభావం ఖచ్చితంగా ఉంది.
100
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ‘హండ్రెడ్’ ఫార్మాట్ టోర్నీని జులైలో నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ధాటికి ఈ టోర్నమెంట్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. టీ20 తరహాలో ఉండే ఈ ఫార్మాట్లో 100 బంతులే ఉంటాయి.
ఆసియా కప్
అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ సెప్టెంబర్లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్కాంగ్ మొత్తం 6 జట్లు తలపడతాయి. టీ20 ఫార్మాట్లో ఆడే ఈ టోర్నీని పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
పురుషుల టీ20 ప్రపంచకప్
ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియా ఇప్పుడు మల్లి పురుషుల టీ20 ప్రపంచకప్కు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. ఐతే అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. అభిమానులు ఈ మెగాటోర్నీ కోసం చాల ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఉమెన్స్ వన్డే ఛాంపియన్షిప్
మహిళల వన్డే ఛాంపియన్షిప్లో భాగంగా మార్చిలో దక్షిణాఫ్రికా×ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్×శ్రీలంక, భారత్×పాకిస్థాన్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఛాంపియన్షిప్ పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు 2021 మహిళల వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా బెర్తు సంపాదించాయి. ఆతిథ్య జట్టుగా న్యూజిలాండ్ కూడా ఈ టౌర్నమెంటుకి అర్హత సాధించింది. ప్రస్తుతం సాధించిన పాయింట్ల దృష్ట్యా భారత్ బెర్తుకు ఎలాంటి ఢోకా లేదు. మిగిలిన జట్లు వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించాలంటే జులైలో శ్రీలంక వేదికగా జరగబోయే క్వాలిఫయిర్ మ్యాచ్ల్లో పాల్గొనాలి.