Andhra PradeshNewsTelugu News
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా చేసిన జగన్మోహన్ రెడ్డి
- ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
- టీచర్లకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు..
- హైకోర్టుకు నిర్ణయాన్ని వెల్లడించిన ప్రభుత్వం.
- పరీక్షల నిర్వహణపై జులైలో సమీక్ష.
కోవిడ్ నేపథ్యంలో పదో పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఏ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై తిరిగి జులైలో సమీక్షించనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసింది. టెన్త్ పరీక్షల వాయిదాపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఉపాధ్యాయులకు టీకాలు ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో శ్రీకాకుళానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సూచించింది. ఈ సందర్భంగా పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ తరఫున న్యాయవాది తెలిపారు. దీనిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించిన కోర్టు.. అనంతరం విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.
ఇటీవల పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై మే తొలివారంలో ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టెన్త్ పరీక్షల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. పరీక్షలకు ఇంకా సమయం ఉందని జగన్ సర్కారు పేర్కొంది.
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆదేశించింది. కరోనా కట్టడికి లాక్డౌన్ ఆంక్షలు అమలుచేస్తున్నా పాజిటివ్ కేసులు తగ్గకపోవడంతో పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.