Blog

మూడు గంటల్లోనే నింగికి చేరిన వ్యోమగాములు.. అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త రికార్డ్


భూమి నుంచి బయలుదేరిన ముగ్గురు వ్యోమగాములు మూడు గంటల్లోనే నింగిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా అంతరిక్ష సంస్థ బుధవారం ప్రకటించింది. కేవలం మూడు గంటల మూడు నిమిషాల్లోనే వ్యోమగాములు రోదసీకి చేరుకున్నట్టు తెలిపింది. ఇంత వేగంతో వ్యోమగాములు ఐఎస్ఎస్‌కి చేరుకోవడం ఇదే తొలిసారి. సాధారణంగా ఈ యాత్రకు కనీసం ఆరు గంటల సమయం పట్టేది. రష్యాకు చెందిన సెర్గే రిజికోవ్‌, సెర్గే కుద్‌-వెర్చ్‌కోవ్‌, వ్యోమగామి కేత్‌ రూబిన్స్‌లు బుధవారం ఉదయం కజక్‌స్థాన్‌లోని బైకనుర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-17 రాకెట్‌ ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు.

ఆరు నెలలపాటు వారు అక్కడే ఉంటారు. ‘ఐఎస్‌ఎస్‌లోని రష్యా విభాగం నుంచి ఆక్సిజన్‌ లీకవుతోంది. దాని కారణంగా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. మేము ఎక్కడ నుంచి ఆక్సిజన్‌ లీకవుతోందో గుర్తించి, మరమ్మతులు చేపడతాం. ఇందుకు అవసరమైన వస్తువులను మాతో పాటూ తీసుకెళ్తున్నాం’ అని రిజికోవ్‌ తెలిపారు. కాగా, యాత్రకు ముందు ఈ ముగ్గురికీ పలుమార్లు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా, వీరు ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడంతో… గత ఏప్రిల్‌ నుంచి అక్కడే ఉంటున్న మరో ముగ్గురు నాసా వ్యోమగాములు వారం రోజుల్లో తిరిగి భూమికి పయనమవుతారు.

‘నిర్దేశిత సమయం కంటే నాలుగు నిమిషాల ముందే మూడు గంటల మూడు నిమిషాల్లోనే అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు’ అని రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ దిమిత్రీ రోగోజిన్ ట్వీట్ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 01.45 గంటలకు బైకనూరు కాస్మోడ్రోమ్ నుంచి బయలుదేరినట్టు తెలిపారు.

ఈ విజయంపై నాసా కూడా ట్వీట్ చేసింది. ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తిరిగి స్వాగతం! ఉదయం 4:48 గంటలకు స్పేస్ క్యాప్సూల్ నాసా వ్యోమగామి కేట్ రూబిన్స్, సెర్గీ రిజికోవ్, సెర్గీ కుద్-వెర్చ్‌కోవ్ విజయవంతంగా చేరారు’ అని తెలిపింది. రూబిన్స్, రిజికోవ్‌లకు ఇది రెండో ప్రయాణం కాగా.. వెర్చ్‌కోవ్ తొలిసారి ప్రయాణించారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close