Blog

చంద్రయాన్-3కి సిద్ధమవుతోన్న ఇస్రో.. కృత్రిమ చంద్రుని ఉపరితల నిర్మాణం!


చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి మెట్టుపై విఫలమయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది చేపట్టే చంద్రయాన్‌-3 విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. భారీ బండ రాళ్లు, గుంతలు, గడ్డకట్టిన మట్టితో చంద్రుని ఉపరితలంపై పరిస్థితులు ల్యాండింగ్‌కు ఏమాత్రం సహకరించవు. ఈ ఉపరితలాన్ని పోలిన కృత్రిమ నిర్మాణాన్ని కర్ణాటకలోని చెళ్లకెరె ప్రాంతంలోని ఉళ్లర్తిలో ఏర్పాటు చేస్తున్నారు.

అక్కడి ఇస్రో ప్రాంగణంలో రూ.24.2 లక్షలతో నిర్మించే కృత్రిమ చంద్రుని బిలం పనులు సెప్టెంబరు మొదటి వారంలో పూర్తవుతాయని ఇస్రో అధికారులు వెల్లడించారు. పది మీటర్ల వ్యాసం, మూడు మీటర్ల లోతులో నిర్మించనున్న ఈ బిలం ల్యాండర్‌లోని సెన్సార్ల పరితీరును పరిశీలించే పరీక్ష(ఎల్‌ఎస్‌పీటీ)గా ఇస్రో పేర్కొంది. కృత్రిమ చంద్ర బిలం ద్వారా రాకెట్‌లో సెన్సార్లు, ల్యాండర్‌కు మార్గనిర్దేశం చేయడంలో ఎంత సమర్థవంతంగా ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.

చంద్రయాన్‌-2 తరవాత చేపట్టే చంద్రయాన్‌-3 ప్రయోగం కూడా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధమవుతోంది. ఈ సారి ల్యాండర్‌ గమన వేగాన్ని నిర్ధారించే బహుముఖ ప్రయోజనకర సెన్సార్లను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కృత్రిమ ఉపరితలంపై కనీసం మూడుసార్లు సామర్థ్య పరీక్షలు జరిపిన తరవాతే చంద్రయాన్‌-3ని ప్రయోగిస్తామని వివరించారు.

చంద్రయాన్-2 మాదిరిగానే తదుపరి మిషన్ కూడా స్వయంప్రతిపత్తి కలిగి ఉంటుంది. ల్యాండింగ్ ప్రదేశం నుంచి ల్యాండర్ ఎత్తును అంచనా వేయడం, వేగాన్ని నిర్ణయించడానికి, బండరాళ్లు, అస్తవ్యస్త ఉపరితలం నుంచి క్రాఫ్ట్‌ను దూరంగా ఉంచడానికి సహాయపడేలా బహుళ సెన్సార్‌లను వినియోగించనున్నారు. ఈ పరీక్షలో సెన్సార్లతో ఎగురుతున్న ఇస్రో రాకెట్ కృత్రిమ చంద్ర ఉపరితలంపై 7 కిలోమీటర్ల ఎత్తు నుంచి దిగుతుంది. సుమారు 2 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ సెన్సార్లు మార్గనిర్దేశం చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని భావిస్తున్నారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close