Blog

అంతరిక్ష యాత్రలో చైనా మరో ఘనత.. పునర్వినియోగ వ్యోమనౌక ప్రయోగం సక్సెస్‌


ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక విజయం లభించింది. పునర్వినియోగ వ్యోమనౌక ప్రయోగాల్లో చైనా మరో మైలురాయి దాటింది. రెండురోజుల క్రితం చైనా ప్రయోగించిన పునర్వినియోగ అంతరిక్షనౌక విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చింది. ఆగ్నేయ చైనాలోని జిక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌తో ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. రెండు రోజుల పాటు నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించిన ఈ నౌక తిరిగి భూమిపై ముందే నిర్ణయించిన స్థలంలో ల్యాండ్‌ అయింది. ఇది పునర్వినియోగ వ్యోమ నౌక సాంకేతిక పరిశోధనలో కీలక ముందడుగుగా చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

విజయవంతమైన పునర్వినియోగ వ్యోమనౌక ప్రయోగం దేశ ముఖ్యమైన పురోగతికి సంకేతం.. తక్కువ ఖర్చుతో శాంతియుత ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. అయితే, దీనికి సంబంధించిన ఎటువంటి ఫోటోను గానీ, వివరాలను గానీ చైనా ప్రచురించలేదు. అమెరికా గతంలో ప్రయోగించిన మానవరహిత పునర్వినియోగ వ్యోమనౌక ఎక్స్‌-37బీ తరహాలోనే ఇదీ ఉంటుందని అధికారులు చెప్పినట్లు మీడియా తెలిపింది.

ఇప్పటివరకూ ఎక్స్‌-37బీ నాలుగు మిషన్లలో పాలుపంచుకుంది. ప్రపంచ దేశాలు ఆధారపడుతోన్న అమెరికా దిక్సూచి వ్యవస్థ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(జీపీఎస్‌)కు పోటీగా తయారు చేస్తున్న బీడో నావిగేషన్‌ సిస్టం ప్రాజెక్టును చైనా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రాజెక్టు పూర్తి వినియోగంలోకి రావడానికి అవసరమైన 35 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.

మూడేళ్ల కిందట చైనా అధికారికి మీడియా జున్హూ ఓ కథనం ప్రచురిస్తూ.. ఈ ఏడాది పునర్వినియోగ వ్యోమనౌకను చైనా ప్రయోగించనుందని తెలిపింది. అంతేకాదు, ఇది సంప్రదాయ వ్యోమనౌకలకు భిన్నంగా ఉంటుందని, యుద్ధ విమానం మాదిరిగా అంతరిక్షంలోకి దూసుకెళ్తుందని వివరించింది.

ఎక్స్-37బీ ఆరో మిషన్ ప్రారంభించిన తరువాత మే చివరి నుంచి కక్ష్యలో ఉందని ఎయిర్ ఫోర్స్ ఫ్యాక్ట్‌షీట్ తెలిపింది. మానవరహిత వ్యోమనౌకను భూకక్ష్యకు తక్కువ ఎత్తులో ప్రయోగించేలా రూపొందించారు..ఇది దీర్ఘకాలిక అంతరిక్ష సాంకేతిక ప్రయోగం, పరీక్షలకు ఉపయోగపడుతుందని.. రన్‌వే ల్యాండ్ అవుతుంది’అని వైమానిక దళం పేర్కొంది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close